Tuesday 11 August 2015

బాబుకు గుచ్చుకుంటున్న ‘రోజా’ముల్లు

తెలుగుదేశం పార్టీలో పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా కీలకపాత్ర పోషించిన ప్రముఖ సినీనటి, ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా మొదటి నుండి రాజకీయాల్లో కొంత డేరింగ్ గానే దూసుకువెళ్తుంది. 2009 ఎన్నికలకు ముందు టీడీపీలో కీలకంగా ఉన్న రోజా చిత్తూరు జిల్లా నగరిలో పూర్తి పట్టు సాధించింది. చివరి నిమిషంలో కాంగ్రెస్ నుండి వచ్చిన గాలి ముద్దుకృష్ణమనాయుడుకు నగరి టికెట్ ఇచ్చి రోజాను చంద్రగిరికి పంపడంతో రోజా ఎన్నికల్లో ఓడిపోయింది. ఆ తరువాత ఆమె కాంగ్రెస్ లోకి అటు నుండి జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లింది. చంద్రబాబు రాజకీయాల గురించి పూర్తి అవగాహన  ఉన్న రోజా బాబును విమర్శించడంలో దిట్ట. ఆంధ్రకు ప్రత్యేకహోదా కొరకు ఢిల్లీ జంతర్ మంతర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాలో రోజా బాబు పరువు తీసింది.
“ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా సాధించాడు. పట్టిసీమ ప్రాజెక్టును మొదలు పెట్టి కాంట్రాక్టర్ల నుండి కమీషన్లు దండుకుని అవినీతిలో ప్రత్యేకహోదా సాధించాడు. అవినీతి చేసిన సొమ్ముతో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొని ఏసీబీకి అడ్డంగా దొరికిపోయి ఆంధ్రప్రదేశ్ పరువును తీయడంలో చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా సాధించాడు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే బాబు ఆంధ్ర పరువు తీశాడు.
ఎన్నికలకు ముందు ప్రత్యేకహోదా అని ప్రకటించిన మోడీ చంద్రబాబు నాయుడులు ఇప్పుడు ఏం చెప్పడం లేదు. ఎక్కడ కేంద్రాన్ని గట్టిగా అడిగితే తన అవినీతి మీద విచారణకు ఆదేశిస్తారో అని చంద్రబాబు కిక్కురుమనడం లేదు. గత ఎన్నికల్లో ఆంధ్రకు ప్రత్యేకహోదా ఇస్తామన్న మోడీ పీఎం హోదా సాధించాడు. చంద్రబాబు నాయుడు ఆంధ్రకు సీఎం హోదా సాధించాడు. కానీ ఆంధ్రకు ప్రత్యేక హోదా మాత్రం రాలేదు” అని నటి, ఎమ్మెల్యే రోజా బాబును ఎద్దేవా చేశారు. మొత్తానికి బాబుకు రోజా కొరకరాని కొయ్యాల తయారవుతున్నది వాస్తవం

No comments:

Post a Comment