Monday 7 March 2016

వీడియోలు ప్రసారం చేసిన చానెళ్లపై కేసు



వీడియోలు ప్రసారం చేసిన చానెళ్లపై కేసు

న్యూఢిల్లీ: జెఎన్‌యూ వివాదంలో మార్ఫింగ్ చేసిన వీడియోలను ప్రసారం చేసిన చానెళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆ చానెళ్లకు వ్యతిరేకంగా కోర్టులో కేసు నమోదు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం సోమవారం తన న్యాయవాదిని ఆదేశించింది.

ఫిబ్రవరి 9న జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో దేశద్రోహ, జాతి వ్యతిరేక నినాదాలు చేసినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదంపై విచారణ జరిపిన మేజిస్ట్రేట్‌..
అసలు ఆ కార్యక్రమంలో 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు చేయలేదని, ఆ నినాదాలను వీడియోల్లో తదనంతరం మార్ఫింగ్ ద్వారా చేర్చారని తేల్చారు. ఫిబ్రవరి 9, 11 తేదీల్లో జరిగిన ఘటనలకు సంబంధించి మొత్తం తొమ్మిది వీడియోలు తెరపైకి రాగా.. అందులో రెండు వీడియోలను మార్ఫింగ్ చేసినట్టు తెలుస్తోంది. జెఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యకుమార్ నినాదాలు చేస్తున్న వీడియోను కూడా మార్ఫింగ్ చేసి.. అందులో దేశద్రోహ నినాదాలు ఉన్న ఆడియోను జోడించినట్టు అనుమానిస్తున్నారు.

ఈ వీడియోలు వెలుగులోకి వచ్చిన అనంతరమే కన్హయ్యతోపాటు మరికొందరు జెనెన్‌యూ నేతలపై దేశ్రద్రోహం అభియోగాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. జెఎన్‌యూ వివాదంలో కొన్ని టీవీ చానెళ్లతో ఏబీవీపీ నేతలు మాట్లాడి కథనాలు ప్రసారం చేయించినట్టు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వివాదంపై ప్రసారం చేసిన కథనాల వీడియోలను అందించాలని మేజిస్ట్రేట్‌ కోరినప్పటికీ ఆయా చానెళ్లు ఆ వీడియోలను సమర్పించలేదు. ఈ  నేపథ్యంలో మూడు జాతీయ చానెళ్లపై చట్టపరమైన చర్యలకు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

No comments:

Post a Comment